జంగారెడ్డిగూడెం ఘటనపై ముఖ్యమంత్రి జగన్ అబద్దాలు చెపుతున్నారని, అసెంబ్లీలో అబద్దాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వెంటనే బాధిత కుటుంబాలను పరామర్శించి, బాధిత కుటుంబాలకు పరిహారం రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి.. సొంత బ్రాండ్ అమ్ముకున్న ఒకే ఒక వ్యక్తి జగన్ అని రామకృష్ణ విమర్శించారు.సీఎం తన బ్రాండ్ల ద్వారా ఇప్పటి వరకు 10 వేల కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. అదాని, అమిత్ షా, జగన్ బలమైన మిత్రులని, అలాంటి బీజేపీ తనకు రోడ్ మాప్ ఇవ్వాలని కోరడం పవన్ అమాయకత్వం అవుతుందన్నారు. పవన్ సత్యాలు అర్థం చేసుకుంటారని, బీజేపీకి, జనసేనకు త్వరలో తెగతెంపులు జరగడం ఖాయమన్నారు. బీజేపీ, వైసీపీలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పవన్ కలిసివస్తారని, అదే ప్రజలు కోరుకుంటున్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు.