మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభానులను బుజ్జగించిన సీఎం జగన్ ఇవాళ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, పలువురు ఎమ్మెల్యేలను బుజ్జగించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మేకతోటి సుచరిత బుధవారం సుమారు గంటన్నర భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు వీసమెత్తు అవమానం కూడా జరగలేదన్నారు. జడ్పీటీసీ స్థాయి నుంచి హోంమంత్రి వరకు తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారని తెలిపారు. కేబినెట్లో కొంతమందిని మారుస్తామని సీఎం జగన్ ముందే చెప్పారని అన్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యల వల్లే ఇంటి నుంచి బయటకు రాలేకపోయానని తెలిపారు. అనారోగ్య, వ్యక్తిగత కారణాలతో కేబినెట్లో కొనసాగలేనేమోనని థాంక్స్ చెబుతూ లేఖ రాస్తే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రకరకాలుగా వార్తలొచ్చాయి. పదవి ఆశించి రాకపోవడంతో చిన్న ఎమోషన్కు గురయ్యా. దయచేసి ఇంతటి ఆపేయాలని కోరతున్నా అని అన్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీరణలో సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని సుచరిత తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో మనిషిగా తనను ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.