ఏపీ ముఖ్యమంత్రి జగన్ భార్య వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ… గత ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతి మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించి ఒక వర్గం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనికి సంబంధించిన ఆధారాలను డీజీపీకి సమర్పించామని చెప్పారు. మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఢల్లీి లిక్కర్ మాఫియా అంశంలో భారతిపై నీచమైన ఆరోపణలు చేస్తూ… జగన్ ను మానసికంగా కుంగదీయాలని భావిస్తున్నారని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. జగన్ తేల్చుకోవాల్సిన విషయాలను ఆయనతో తేల్చుకోలేక… ఆయన భార్యపై బురద చల్లాలనుకోవడం దారుణమని చెప్పారు. మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేసే వారికి కఠినమైన సందేశాలను పంపించాల్సిన అవసరం ఉందని అన్నారు.