: సజ్జల
పేదలందరికీ ఇళ్లు పథకంపై ఏపీ హైకోర్టు తీర్పు ద్వారా పెద్ద దెబ్బ తగిలిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాల పై కోర్టుకు వెళ్లి స్టే తేవడం వెనుక టీడీపీ కుట్ర ఉందని ఆరోపించారు. ఇళ్ల స్థలాల పేరిట లబ్దిదారులకు తెలియకుండా కొందరు హైకోర్టులో కేసు వేయించారని అన్నారు. సీఎం జగన్పై ఉన్న అసూయతో చంద్రబాబు చేసిన నిర్వాకమే ఇదని, ఎన్బీసీ స్టాండర్డ్స్ ప్రకారమే స్థలం ఎంత ఉండాలనేది నిర్ణయించామన్నారు. 31 లక్షల మందికి గృహ నిర్మాణాల్ని చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారిందని సజ్జల చెప్పుకొచ్చారు. ఈ మేరకు తాడేపల్లిలో సోమవారం సజ్జల మాట్లాడుతూ, పిటిషన్ వేసిన వారిలో కొంతమంది ఆ పిటిషన్తో సంబంధమే లేదని అంటున్నారని మరి దీని వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. రాజకీయ శక్తులు తెర వెనక ఉండి పన్నాగంతో దుష్టక్రీడకు తెరతీశాయన్నారు. కోర్టుల్లో అఫిడవిట్లు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటోందని అన్నారు. హైకోర్టు సింగిల్ బెంచి ఆదేశాలపై డివిజన్ బెంచ్కు వెళతామని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా దేశీయంగా బొగ్గు లభ్యత లేకపోవడం, వాటి రేటు పెరగడం వల్ల విద్యుత్ సమస్య వచ్చిందన్న ఆయన, డబ్బు పెట్టినా సమస్యను తీర్చే పరిస్థితి లేదన్నారు. ఇళ్లలో కరెంటు వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ణప్తి చేస్తున్నామని సజ్జల అన్నారు.