జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబీలోకి నెట్టిందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మీడియా హక్కులను ప్రభుత్వం హరిస్తోందని అన్నారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రశ్నించాల్సిన గవర్నర్ స్పందించడం లేదని, అందుకే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నామని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. కాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. ప్రసంగ ప్రతులను చించివేసి గాల్లోకి విసిరారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేయబోయారు. అయితే.. గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ ప్రజాప్రతినిధులు వెళ్లనీయకుండా మార్షల్స్ అడ్డుకున్నారు.