జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో స్పందనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందనలో భాగంగా ఉపాధి హామీ కార్యక్రమం కింద చేపట్టిన పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్, డిజిటిల్ లైబ్రరీలు, ఏఎంసీలు, బీఎంసీలు, గృహనిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష, ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భూ సేకరణ, నాడు-నేడు, స్పందన కింద అర్జీల పరిషారం తదితర అంశాలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, 26 జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేశామన్న విషయం అందరికీ తెలియాలన్నారు. ‘‘పరిపాలన అనేది సులభతరంగా ఉండాలి. ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలి. మరింత మానవీయ దృక్పథంతో ప్రజల పట్ల ఉండాలి. ఈ విషయాలను ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ’’ సీఎం సూచించారు.