ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో నంబర్ 59ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు ఈ విషయాన్ని తెలియజేశారు. జీవో 59పై దాఖలైన వివిధ పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన హైకోర్టుకు తెలిపారు. దీంతో పాటు డ్రస్ కోడ్ నిబంధనలను సైతం వెనక్కు తీసుకుంటున్నట్లు కోర్టుకు స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ మహిళా సిబ్బందిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని, త్వరలోనే పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామనడంతో న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో సంరక్షకులుగా విధులు నిర్వహిస్తోన్న మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ఈ ఏడాది జూన్ 23న ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 59ని జారీ చేసింది. కానిస్టేబుల్కు ఉండే సర్వ అధికారాలు, బాధ్యతలను వారికి అప్పగించాలని ఈ జీవోలో పేర్కొంది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్లోని సెక్షన్ 1, 6, 11, 21తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు విరుద్ధంగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు.