ఏపీలో అత్యాచారాలు ముమ్మాటికీ టీడీపీ నేతల పనే అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం జగన్ కన్నా మరో అడుగు ముందుకేసిన విజయసాయిరెడ్డి..టీడీపీ నేతలే కిరాయి గూండాలతో రాష్ట్రంలో నేరాలు చేయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు చేసే అత్యాచారాలను, హత్యలను వైసీపీ ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జాబ్ మేళా ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా, వైసీపీ ఒంటరిగానే బరిలో దిగుతుందని, గతంలో కంటే ఈసారి తమకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోతామని భయపడేవాళ్లే పొత్తుల గురించి ఆలోచిస్తారని అన్నారు. చంద్రబాబుకు ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేదని తెలిపారు. ఎప్పుడూ ఇతరులపై ఆధారపడే చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని విజయసాయి స్పష్టం చేశారు.