టీడీపీ నేత చింతకాయల విజయ్పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.విచారణకు హాజరు కావాలని 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన సమయంలో.. విజయ్ ఇంట్లో లేరు. దీంతో.. సర్వెంట్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చిన సమయంలో.. విజయ్ ఇంట్లో పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. వచ్చిన వారు ఎవరు.. ఎందుకొచ్చారో తమకు తెలియని పరిస్థితి నెలకొందని కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఈనెల 6న 10 గంటల 30 నిమిషాలకు మంగళగిరిలోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. చింతకాయల విజయ్ హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉంటారు. ఐటీడీపీ కో కన్వీనర్గా ఉన్నారు. ఈ ఐటీడీపీకి సంబంధించి రెండు రోజుల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని మార్పింగ్ చేశారని పోలీసుల అభియోగంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం సీఐడీ పోలీసులు విజయ్ ఇంటి దగ్గరలోనే ఉన్నట్లు సమాచారం. దీనిపై టీడీపీ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ఏదైనా కేసు ఉంటే నిబంధనల ప్రకారం పోలీసులు నడుచుకోవాలని, అలా కాకుండా విజయ్ని ఎలా అదుపులోకి తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.