కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ఫలితంపై పలువురు వైసీపీ నేతలు స్పందించారు. ఫలితాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ, టీడీపీ లోపాయికారి ఒప్పందంతో బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందని అన్నారు. గతంలో వచ్చిన మెజారిటీకి మించి ఇప్పుడు ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే దీనికి కారణమని చెప్పుకొచ్చారు.
ఉపఎన్నిక ఫలితంపై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. సీఎం వైఎస్ జగన్ పై అభిమానంతో గత ఎన్నికల్లో 45 వేలు మెజారిటీ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి 90 వేలకు పైగా మెజారిటీ అందించారని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రలు చేసినా ప్రజలు వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారన్నారు.2024 సాధారణ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు.
ఫలితాలపై ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, బద్వేలు ఉప ఎన్నికలు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు రెఫరెండంగా భావించారని అన్నారు. ప్రజలు దేశం మొత్తం గర్వించేలా సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరిచారన్నారు. బీజేపీ,జనసేన, టీడీపీలు కలిసినా డిపాజిట్ కూడా దక్కలేదని పేర్కొన్నారు. ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. మరింత మన్ననలు పొందేలా పనిచేస్తామని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.