తారకరత్న పార్థీవదేహానికి నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానులు భారీగా ఫిలిం ఛాంబర్కు చేరుకుంటున్నారు. తారకరత్న మృతి చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫిల్మ్ చాంబర్లో తారకరత్న పార్దీవ దేహానికి ఆయన నివాళులు అర్పించారు. తారకరత్న భౌతికకాయంపై పూలమాలలు వేసి తలసాని నివాళులు అర్పించారు. ఈ సందర్భంటా మాట్లాడుతూ.. 20వ ఏట చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తారకరత్న 21కి పైగా చిత్రాలలో నటించారని గుర్తు చేశారు.తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ఫిలింఛాంబర్ వద్ద ఉంచిన తారకరత్న భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నటుడు శివాజీ, హీరో వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, దగ్గుబాటి పురందేశ్వరి నివాళులర్పించారు.నందమూరి కుటుంబసభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. తారకరత్న కడసారి చూపుకోసం నందమరి ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు. మధ్యాహ్నాం మూడున్నర తర్వాత తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.