విరిగిపడిన కొండచరియలు..
తిరుమల రెండు ఘాట్ రోడ్లు మూసివేత
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో గత రెండు రోజులుగా అతిభారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణుకుతోంది.తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షానికి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఎటు చూసినా ప్రవహించే నీటితో పరిస్థితులు భయానకంగా మారాయి. కనుమ దారులు వాగులుగా మారగా.. కాలినడక మార్గాలు జలపాతాన్ని తలపిస్తున్నాయి. ఎప్పుడు లేనంతగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సెల్లార్లోకి వరద నీరు చేరింది. తిరుమాఢ వీధిల్లో రహదారులు నీటితో చెరువులను తలపిస్తున్నాయి.ముఖ్యంగా తిరుమల ఘాట్ రోడ్డుపై వరద పారుతోంది. దీంతో అధికారులు తిరుమల రెండు ఘాట్ రోడ్లను మూసివేశారు. తిరుమలకు భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. మరోవైపు రెండో ఘాట్ రోడ్లో 18 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రయాణానికి ఇబ్బందిగా మారడంతో ఘాట్ రోడ్లను అధికారులు మూసివేశారు. కపిలతీర్థం, తిరుమల బైపాస్ రోడ్పై వందలాది వాహనాలు స్తంభించాయి. రెండ్రోజుల పాటు కనుమ దారులను మూసివేశారు. కనుమ దారులను మూసివేయాలని సీఎం జగన్ ఆదేశించడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. నేడు, రేపు దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు తరువాతి రోజుల్లో శ్రీవారి దర్శనానికి అనుమతినివ్వనున్నట్టు టీటీడీ ఈవో జవహర్రెడ్డి తెలిపారు.రేణిగుంట విమానాశ్రయ పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. తిరుపతి-కడప మార్గాల్లో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.