శేషాద్రి మృతికి సీజేఐ రమణ, జగన్, చంద్రబాబు సంతాపం
తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన మరణించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వెళ్లారు. కాగా.. వేకువజామున గుండెపోటు రావడంతో.. ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు.1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2007లో రిటైర్ అయినప్పటికీ శేషాద్రి సేవలు అనివార్యం కావడంతో ఆయనను టీటీడీ తిరిగి ఓఎస్డీగా కొనసాగింది. డాలర్ శేషాద్రి మృతి పట్ల సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం తెలిపారు. శేషాద్రి మృతి శ్రీవారి ఆలయానికి, భక్తకోటికి తీరని లోటని పేర్కొన్నారు. ఆలయ వ్యవహారాలపై శేషాద్రి చెరగని ముద్ర వేశారని సీజేఐ కొనియాడారు. శ్రీవారి సేవలపై శేషాద్రికి ఉన్న అవగాహన అనన్యసామాన్యమన్నారు. ఆలయ ఆచారాలపై శేషాద్రికి ఎంతో అవగాహన పరిజ్ఞానం ఉందని తెలిపారు. డాలర్ శేషాద్రి కుటుంబసభ్యులకు ఎన్వీ రమణ ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలర్ శేషాద్రి హఠాన్మరణంపై ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. శేషాద్రి కుటుంబసభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలర్ శేషాద్రి మృతి బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శేషాద్రి మృతి టీటీడీకి తీరనిలోటు అని చెప్పారు.