పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న జవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరానికి 120 కిలోమీటర్ల చేరువలో తుపాను కేంద్రీకృతమైంది. ఇక విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 120 కిలోమీటర్లు, గోపాల్పుర్కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది.ఉత్తర దిశగా కుదులతున్న తుపాను రేపు (ఆదివారం) మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని ప్రభావంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80`90 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రపు అలలు 3.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టంచేసింది.