గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాంటిన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్యాంటిన్ను తీసివేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. క్యాంటిన్ నిర్వహణతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఉద్రిక్తతల మధ్యే టీడీపీ నేతలు క్యాంటిన్ ద్వారా భోజనాలు పంపిణీ చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు మూతపడిన నేపథ్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సారథ్యంలో ఆధ్వర్యంలో గత నెల 12 నుంచి అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. అయితే దానికి పోటీగా గతనెల 28న వైస్సార్సీపీ ప్రోత్సాహంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటిన అన్నదాన కార్యక్రమాలు నిలిపివేయాలని, ట్రాఫిక్ ఆంక్షలున్నాయని మున్సిపల్ అధికారులు నిర్వాహకులను కోరారు. అయినప్పటికీ ఈరోజు కూడా అన్నా క్యాంటీన్ను ఓపెన్ చేస్తామని.. ఆహారాన్ని పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగే అవకాశముండడంతో క్యాంటీన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. చుట్టుపక్కలున్న షాపులను కూడా పోలీసులు మూసివేయించారు. దీంతో, అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.