ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నిరుపేద మైనారిటీల వివాహాలకు ప్రభుత్వం తరఫున రూ.50 వేలు అందజేస్తున్న దుల్హన్ పథకంపై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ. 50వేలు ఉన్న ఈ పథకం సాయాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని గత ఎన్నికల పమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పథకాన్ని నిలిపివేస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు షిబ్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇప్పటికే ఓ దఫా విచారణ జరగగా… గురువారం మరో విడత విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా దుల్హన్ పథకాన్ని ఆపేశామని చెప్పారు కదా… అందుకు గల కారణాలేమిటో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ వివరణ అందజేసేందుకు తమకు 4 వారాల గడువు కావాలన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యర్థనను మన్నించిన కోర్టు… విచారణకు 4 వారాలకు వాయిదా వేసింది.