ఏపీ సీఐడీపై మెజిస్ట్రేట్ కు యూట్యూబ్ నిర్వాహకుడు వెంగళరావు వాంగ్మూలం
వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న ‘ఘర్షణ’ యూట్యూబ్ నిర్వాహకుడు బొబ్బూరి వెంగళరావును ఏపీ సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు బస్సులో వస్తుండగా… కోదాడ వద్ద ఆయనను అదుపులోకి తీసుకుని గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం ఆయనను నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. ఆ తర్వాత ఆయనకు ప్రాథమిక వైద్య పరీక్షలను నిర్వహించి… నిన్న రాత్రి గుంటూరు ఆరో అదనపు మెజిస్ట్రేట్ శృతి ఎదుట ఆమె నివాసంలో హాజరుపరిచారు. ఈ సందర్బంగా వెంగళరావు ఇచ్చిన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ నమోదు చేసుకున్నారు. తన రెండు చేతులను పైకి కట్టేసి, వాటి మధ్యలో కర్ర పెట్టి, అరికాళ్లపై కొట్టారని మేజిస్ట్రేట్కు వెంగళరావు చెప్పారు. బల్లపై పడుకోబెట్టి, తన నడుంపై కూర్చొని, కాళ్లు పైకి ఎత్తి కొట్టారని తెలిపారు. ఎంపీ రఘురామకృష్ణరాజును కొడితేనే దిక్కులేదు… నిన్ను కొడితే కోర్టులు ఏం చేస్తాయని సీఐడి పోలీసులు అన్నారని చెప్పారు. నిన్ను కొట్టిన విషయం కోర్టుకు చెప్పకూడదని, ఒక వేళ చెబితే బయటకు వచ్చాక నిన్ను చంపినా కోర్టులు ఏమీ చేయలేవని హెచ్చరించారని అన్నారు. తాము చెప్పినట్టు వింటేనే బతుకుతావని… లేకపోతే నీతో పాటు నీ కుటుంబం కూడా మిగలదని హెచ్చరించారని చెప్పారు. తనను కొట్టిన తర్వాత ఒక కాగితంపై సంతకం చేయించుకున్నారని… ఆ కాగితంలో ఉన్న విషయాలు వాస్తవాలు కాదని తెలిపారు. తాము కొట్టామని మేజిస్ట్రేట్కు చెపితే నీకు బెయిల్ కూడా రాదని, కొట్టలేదని చెపితేనే బెయిల్ వస్తుందని చెప్పారని వెంగళరావు తెలిపారు. వెంగళరావు ఇచ్చిన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ శృతి నమోదు చేశారు. సీఐడీ పోలీసులు కొట్టిన గాయాలను మేజిస్ట్రేట్కు వెంగళరావు చూపించారు. దీంతో, ఆయనకు తిరిగి వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆమె ఆదేశించారు. దీంతో, రాత్రి 11.55 గంటల సమయంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను జీజీహెచ్కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్ లో జడ్జికి అందజేయనున్నారు. మరోవైపు వెంగళావుపై సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.