ఏపీలోని 26 జిల్లాల్లో కేవలం ఐదుగురు రెడ్లు మాత్రమే పెత్తనం చెలాయిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో పెత్తనం చెలాయిస్తున్న వారిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన ఉన్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు.. ఈ ఐదుగురే రాష్ట్రంలోని 26 జిల్లాలను పాలిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారని కూడా రామకృష్ణ ధ్వజమెత్తారు.ఇక మంత్రుల అధికారాల విషయంపై మాట్లాడిన రామకృష్ణ… ఏపీలోని ఏ ఒక్క మంత్రికి కూడా అధికారారాలు లేవని తేల్చి పారేశారు. మంత్రులు ధర్మాన, బొత్సతో పాటు కేబినెట్లోని మంత్రులంతా డమ్మీలేనని ఆయన ఆరోపించారు. హోం మంత్రిగా ఉన్న మహిళా నేతకు కనీసం ఎస్సైని బదిలీ చేసే అధికారం కూడా లేదని అన్నారు.