ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా, ఆదోనిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో జగనన్న విద్యా కానుకను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ. 931 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్లు అందజేస్తున్నామన్నారు. వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యాకానుక ఇస్తున్నామన్నారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు అవసరమన్నారు. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుంది. ప్రతి ఒక్కరూ ఇంగ్లీషు మీడియం చదువుకోవాలని అన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టామన్నారు. బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకుని బైజూస్ యాప్ తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు.