బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించిన పవన్కల్యాణ్
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ చేపట్టిన ‘కౌలు రైతుల భరోసా యాత్ర’ ప్రారంభమైంది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో పవన్ కౌలురైతుల భరోసా యాత్రను ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం అందించనున్నారు. ఏయే జిల్లాల్లో ఎంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలను జనసేన యంత్రాంగం ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం కింద సేకరించింది. ఆ సమాచారం ప్రకారమే ఆయా జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ కలుసుకోనున్నారు. కొత్త చెరువు నుంచి ఉదయం 10.30గంటలకు బయలుదేరి ధర్మవరానికి చేరుకొని మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించారు. అనంతరం ధర్మవరం నుంచి గొట్లూరుకి చేరుకొని.. మరో రైతు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి 12.10 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేయనున్నారు. జిల్లాలోని పర్యటనలో చివరిగా అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ గ్రామంలో ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేసి.. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు.