Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వారికి 10 గ్రేస్‌ మార్కులు ఇవ్వాలి : పవన్‌ కళ్యాణ్‌

ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలపై పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎక్కువమంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ టెన్త్‌ ఫలితాలపై స్పందించారు. పట్టుమని పది పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేరు.. గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగాను ఉండలేరని విమర్శించార. ధరలను అదుపులో ఉంచి ప్రజలను ఎలానూ సంతోషపెట్టలేరు.. కనీసం పిల్లలకు సరైన చదువు చెప్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అంటూ ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షా ఫలితాలు చూస్తే ఆ పని కూడా చేయలేని చేతకాని ప్రభుత్వమని మరోసారి స్పష్టమైందన్నారు. పిల్లలు చదువులో పరీక్షల్లో ఫెయిలైతే ‘ఇంట్లో తల్లిదండ్రుల మార్గదర్శకం సరిగా లేదు’ అని నెపం వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లల మాన మర్యాదలను నేరగాళ్లు భంగపరిస్తే ‘తల్లుల పెంపకం సక్రమంగా లేదు అని సెలవిస్తారు. అప్పుల పాలై వేరే మార్గం కానరాక, ప్రభుత్వం ఆదుకుంటుందని నమ్మకం లేక కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ‘అసలు వారు కౌలు రైతులు కానే కాదు’ అంటూ తిమ్మిని బమ్మిని చేస్తారన్నారు. వైఎస్సార్‌సీపీ సర్కారు వారి ఇటువంటి వాదనలు వింటుంటే ఈ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే కాదు తెలుగువారందరికీ రోత కలుగుతోంది అన్నారు. 2018, 19లో పదో తరగతి ఫలితాలను పరిశీలిస్తే వరుసగా 90శాతంపైగా ఉంటే.. ఈ ఏడాదికి సంబంధించి విడుదలైన ఫలితాలలో 67.26% మంది మాత్రమే ఉతీర్ణులయ్యారరన్నారు. గత ఫలితాలతో పోలిస్తే ఇది అత్యల్ప ఉతీర్ణతని.. రెండులక్షల మందికి పైగా విద్యార్ధులు ఫెయిల్‌ అయ్యారన్నారు. దీనికి కారణం తల్లిదండ్రులే అని చెప్పి.. వారి చేతగానితనాన్ని దాచి పెట్టుకోవచ్చన్నారు. విద్యా వ్యవస్థలో లోపభూయిష్ట విధానాలను మాత్రం చరిత్ర దాచి పెట్టుకోదన్నారు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం పెట్టి పాఠశాలలకు రంగులేస్తున్నాం.. ఇంగ్లీషులో పాఠాలు చెప్పేస్తాం అనగానే సరిపోదన్నారు. నాడు – నేడు కోసం రూ.16వేల కోట్లు ఇచ్చామని చెప్పుకొన్నారని.. ఈ ఫలితాలు చూస్తే ఆ వేల కోట్ల రూపాయలు ఎటుపోయాయి అనిపిస్తోందన్నారు. ముందుగా తగినంతమంది బోధన సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డీఎస్సీ ప్రకటనే ఇవ్వలేదు అనేది వాస్తవమని.. విద్యా ప్రణాళిక పటిష్టంగా ఉండాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాపారంగతుల సూచనలను పరిగణనలోనికి తీసుకోవాలని.. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అరకొర ఉన్న ఉపాధ్యాయులకు మద్యం షాపులు దగ్గర క్యూ లైన్ల నిర్వహణకు డ్యూటీ వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిగ్గుపడే అలాంటి డ్యూటీలు చేయించి.. మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకంలో ఫోటోలు తీయడం వంటి పనులు అప్పగించి విద్యార్ధులకు పాఠాలు చెప్పే అసలు విధులకి దూరం చేసిన పాపమే ఈనాటి ఫలితాలు అన్నారు. రీ వాల్యూయేషన్‌ చేస్తాం రూ.500 కట్టండని మరో దోపిడీకి సర్కారు వారు తెర తీసిందని.. అదేమీ కుదరదు.. పరీక్ష తప్పిన పిల్లలల మానసిక స్థితి, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, వారి విలువైన కాలం వృథా కాకుండా ఫెయిల్‌ అయిన వారికి 10 గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత రీ కౌంటింగ్‌, ఆపైన సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను ఉచితంగా చేయాలని జనసేన పక్షాన, పిల్లల తల్లిదండ్రుల పక్షాన డిమాండ్‌ చేస్తున్నాను అన్నారు. చేతకాని తనాన్ని పిల్లల భవిష్యత్తుపై రుద్దవద్దన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img