‘జగనన్న పాలవెల్లువ’ ప్రారంభోత్సవంలో సీఎం జగన్
పాలు పోసే రైతులే అమూల్ సంస్థ యాజమనుల అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘కృష్ణాజిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది చారిత్రాత్మక ఘట్టం. జిల్లాలో రైతులు, అక్కాచెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభిస్తుంది. ఇప్పటికే ఐదు జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమైంది. అమూల్ సంస్థ ప్రకాశం జిల్లాలో 245 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 275 గ్రామాలు, వైఎస్సార్ జిల్లాలో 149 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 174, గుంటూరు జిల్లాలో 203 గ్రామాల నుంచి పాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 148.50 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగింది. పాడి రైతులకు దాదాపు రూ.71 కోట్లు చెల్లించారు. ఇతర డైరీలతో పోల్చితే అమూల్ పది కోట్లు అదనంగా ఇచ్చింది.’ అని చెప్పారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆర్థిక చైతన్యానికి ఈ పాలవెల్లువ కార్యక్రమం ఊతమిస్తోందని పేర్కొన్నారు.