పోలవరం ఎత్తు ఎప్పుడూ పెంచలేదని, అది ముందు అనుకున్న డిజైన్ ప్రకారం నిర్మాణం అవుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా అక్కడ కొత్త ఏమీ జరగడం లేదని వివరణ ఇచ్చారు. విభజన చట్టంలో ఉన్న అంశాల ప్రకారమే జరుగుతోందని అన్నారు. ఆ డిజైన్ ప్రకారం భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేదని అన్నారు. ప్రస్తుతం భద్రాచలంలో వందేళ్ల చరిత్రలోనే వచ్చిన అధిక వరదలు కాబట్టి, అంతగా అక్కడి ప్రాంతాలు ప్రభావితం అయ్యాయని అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు పోవడం వల్ల ఆంధ్రాకు బాగా నష్టం జరిగింది. అందుకని హైదరాబాద్ను కూడా ఆంధ్రాకు కలపాలని, ఇంతకుముందులా ఉండాలని అడిగితే బాగుంటుందా? ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే ఎలాంటి అభ్యంతరం ఉండదు. అని అన్నారు.‘ కాబట్టి, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. పువ్వాడ అజయ్.. అతని సంగతి అతను చూసుకోమనండి. మా రాష్ట్రంలో విలీనం అయిన గ్రామాల బాధ్యత పూర్తిగా మాదే. ఖమ్మం జిల్లా గురించి చూసుకోమనండి. పక్క రాష్ట్రాల గురించి కామెంట్ చేయడం బాధ్యతగల వ్యక్తికి తగదు. మాకు ఒకరు చెప్పాలా? అన్ని విషయాలు మాకు తెలుసు. ఇప్పటికే మా ప్రభుత్వం అన్ని సక్రమమైన పనులు చేస్తూ ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చేస్తున్నాం. ఒకవేళ పార్లమెంటులో ఆ 5 గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలపాలనే బిల్లును తీసుకొస్తే, మళ్లీ రెండు రాష్ట్రాలనీ కలపాలనే డిమాండ్ని మేమూ తీసుకొస్తాం. అందులో తప్పేముంది.’ అని బొత్స సత్యనారాయణ మాట్లాడారు.