విద్యుత్ చార్జీల పెంపుపై లోకేశ్ నిరసన
ఏపీలో విద్యుత్ చార్జీలను పెంచుతూ వైస్సార్సీపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం నాడు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద లాంతరు పట్టుకుని లోకేశ్ నిరసన తెలిపారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారంమోపిందన్న లోకేశ్.. పేద, మధ్య తరగతి కుటుంబాలపై అధికభారం మోపారని ఆరోపించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని విధంగా విద్యుత్ చార్జీలు పెంచారన్నారు. ఉగాది రోజు మరో మోసపు పథకాన్ని అమల్లోకి తెచ్చారని విరుచుకుపడ్డారు. అనేక పేర్లతో విద్యుత్ చార్జీలు పెంచి డబ్బు లాగేశారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రిజనరీ ఆలోచనలతోనే జగన్ సర్కారు జనంపై భారం మోపారన్న లోకేశ్.. ఇప్పటికైనా కక్షసాధింపులు మాని జగన్ పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.