మార్క్సిస్టు అధ్యయన కేంద్రం కన్వీనర్ జేవీఎస్ఎన్ మూర్తి
విశాలాంధ్ర`పెందుర్తి: గుజరాత్ మారణకాండ బాధితుల తరున పోరాటం చేసిన మానవ హక్కుల కార్యకర్త తీస్తా సేతల్వాద్, ఆల్ట్ న్యూస్ ప్రతినిధి మహమ్మద్ జుబేర్, మాజీ డీజీపీ శ్రీకుమార్, ఐపీఎస్ అధికారి సంజయ్భట్లను అక్రమంగా అరెస్ట్ చేశారని మార్క్సిస్టు అధ్యయన కేంద్రం కన్వీనర్ జేవీ సత్యనారాయణమూర్తి ఆక్షేపించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ పౌర ప్రజాసంఘాల సమన్వయకర్త పాత్రపల్లి చంద్రశేఖర్ అధ్యక్షతన విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జేవీఎస్ఎన్ మాట్లాడుతూ గుజరాత్ మారణకాండ బాధితుల పక్షాన పోరాటం చేస్తున్న మానవ హక్కుల కార్యకర్త తీస్తా సేతల్వాద్ను, కేంద్ర ప్రభుత్వం దుర్మాగ్గాలను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్న ఆల్ట్ న్యూస్ ప్రతినిధి మహమ్మద్ జుబేర్ను, అల్లర్లల సమయంలో అప్పటి డీజీపీ శ్రీశీకుమార్ను, ఐపీఎస్ అధికారి సంజయ్భట్లను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోదీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎం లక్ష్మి, ఇఫ్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్న మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగ హక్కు లను కాలరాస్తోందని మండిపడ్డారు. పౌర ప్రజా సంఘాల నాయకులు పైడిరాజు, దేవిశ్రీ, పడాల గోవిందు, పద్మ, జ్ఞానంద్, రామ ప్రభు, రమణ, శ్రీను, నూకరాజు, రహిమాణ్, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు.