సీఎం జగన్
గ్రామాలకు మంచి సామర్థ్యం గల ఇంటర్నెట్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఐటీ శాఖ, డిజిటల్ లైబ్రరీపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలకూ ఇంటర్నెట్ సదుపాయం అందించాలని, నిరంతరం ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపయోగకరంగా డిజిటల్ లైబ్రరీలు ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని, తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆగస్టు 15న పనులు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.