ప్రతీ ఎన్నికల్లో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకోవటం పవన్ కళ్యాణ్కు అలవాటని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఒక్కో ఎన్నికల్లో పవన్ ఒక్కొక్కరిని తిడుతూ మాట్లాడతారని అన్నారు. గతంలో తిట్టి ఇప్పుడు మళ్లీ తిరిగి చంద్రబాబుతో పొత్తుకు సిద్దమవుతున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా పేదలకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ఇస్తుందని గమనించాలన్నారు. పవన్కు సీఎం పదవి ఇస్తానంటే పొత్తు పెట్టుకున్నా అర్ధం ఉంటుందని… అయితే చంద్రబాబును సీఎంను చేయటానికి పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారని తెలిపారు. ఎవరినో ముఖ్యమంత్రని చేసి రాష్ట్ర సమస్యలు తీరుస్తానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. సొంత పార్టీ పెట్టుకుని పవన్ బీజేపీని రోడ్డు మ్యాప్ అడగటం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయ్యిందని.. తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను సీఎం జగన్ మంత్రులపై పెట్టారని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం పార్టీ నడుచుకుంటుందని అన్నారు.