185వ రోజుకు ఉక్కు దీక్షలు
విశాలాంధ్ర ` కూర్మన్నపాలెం (విశాఖ): విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద జరుగుతున్న దీక్షలు 185వ రోజుకు చేరుకున్నాయి. రిలే నిరాహార దీక్షలో విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి ఎస్.ఎం.ఎస్ -1 విభాగం నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీక్షా శిబిరం వద్ద త్రివర్ణ పతాకాన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రజా బహుజన వేదిక రాష్ట్ర కార్యదర్శి కె.ఆర్.హరి ప్రసాద్, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ, కో కన్వీనర్ గంధం వెంకట్రావు, సభ్యులు కొమ్మినేని శ్రీనివాస్, పరంధామయ్య, నీరుకొండ రామచంద్రరావు, బి.అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 80 శాతం బహుజనులకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం అందరి కర్తవ్యంగా భావించాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి అవుతున్న ఇంకా బహుజనులకు రాజ్యాధికారంలో చిన్న చూపు కలుగుతోందని విమర్శించారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రజలకు వివరించే విధంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలోనే పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచించి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందశాతం వ్యూహాత్మక అమ్మకాలు ప్రక్రియను తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రజా బహుజన వేదిక రాష్ట్ర అధ్యక్షులు గోవిందు, వై.ప్రసాద్, రాము, బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యు.శ్రీనివాస్, తౌడన్న, సుబ్బయ్య, నాగబాబు, దల్లి రవి, ఎమ్.వి.రమణ, రమణ మూర్తి, నాయుడు తదితరులు పాల్గొన్నారు.