ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాదం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు. ప్రమాదం విషయం ఆవేదన కలిగించిందని తెలిపారు. ఎంతో బాధాకరమైన ప్రమాదమని.. జల్లేరు వాగులోకి బస్సు పడిపోవడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు న్యాయమైన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘోర ప్రమాదానికి కారణాలపై అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.