ఏపీలో అంబులెన్స్ నిర్వాహకుల ఆగడాలు ఆగడంలేదు. మృతదేహాల తరలింపునకు వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనాలపై మృతదేహాలను తరలించాల్సి వస్తోంది.వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా, సంగం ఎస్సీ కాలనీలో పదేళ్ల రాము, ఎనిమిదేళ్శ ఈశ్వర్ ఇద్దరూ ఆడుకుంటూ కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో జారీ పడిపోయారు. వారిని వెతుకులాడే సమయానికి ఇద్దరూ మృత్యువాతపడ్డారు. ముందుగా రాము బాడీ లభ్యమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఒకటిన్నర కి.మీ. దూరంలో ఉన్న ఇంటికి బాలుడి మృతదేహాన్ని తరలించడానికి ప్రైవేటు వాహనదారులు వేల రూపాయలు డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది మహా ప్రస్థానం వాహనం ఏర్పాటు చేయలేదు. దాంతో బైక్పైనే మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది. అధికారులు, అంబులెన్స్ నిర్వాహకుల తీరుపై బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.