ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కలవరం రేగింది. మంకీపాక్స్ కేసులు అక్కడక్కడ నమోదవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఎక్కువైంది. భారతదేశంలో ఇప్పటి వరకు 10 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో … మంకీపాక్స్ వైరస్ను నిర్ధారించే కిట్ అందుబాటులోకి వచ్చింది. ఈ కిట్ మొట్టమొదటిసారి స్వదేశంలోనే తయారుకావడం గమనార్హం.విశాఖలోని మెడ్ టెక్ జోన్లో ట్రాన్సాసియా బయో మెడికల్స్ సంస్థ ఆర్టీపీసీఆర్ విధానంలో మంకీపాక్స్ వైరస్ను నిర్ధారించే కిట్ను అభివృద్ధి చేసింది. ట్రాన్సాసియా ఎర్బా పేరుతో తయారు చేసిన ఈ కిట్ను కేంద్రంలోని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ శుక్రవారం మెడ్టెక్ జోన్లో ఆవిష్కరించారు. కిట్ ఆవిష్కరణ అనంతరం ట్రాన్స్ ఏషియా వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్ వజిరాణి మాట్లాడుతూ, ఈ కిట్ అత్యంత సున్నితమైనదన్నారు. అయినప్పటికీ ఉపయోగించడానికి సులభతరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కిట్ సాయంతో ఇన్ఫెక్షన్ను ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు. కచ్చితమైన ఫలితం కోసం ఈ కిట్ను ప్రత్యేకంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులను ముందస్తుగా గుర్తించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కిట్ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సైంటిఫిక్ సెక్రటరీ అరబింద మిత్ర, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ బలరాం భార్గవ, బయోటెక్నాలజీ విభాగం సలహాదారుడు అల్క శర్మ తదితరులు పాల్గొన్నారు.