వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, దాని కింద కార్యక్రమాలు, వైద్య ఆరోగ్యశాఖలో నాడు`నేడు కింద చేపడుతున్న పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ తదితర అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ తరహా ప్రసవం జరిగినా తల్లికి రూ.5వేలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఏ తరహా ప్రసవం జరిగినా తల్లికి రూ.5వేలు ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్ జరిగినా రూ.5వేలు ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకూ సిజేరియన్ జరిగితే రూ.3వేలు ఇస్తున్నారు. దీన్ని రూ.5వేలకు పెంచాలని సీఎం ఆదేశించారు. సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని సహజ ప్రసవంపై అవగాహన, చైతన్యం నింపాల్సిన బాధ్యత వైద్యులదేనని సీఎం తెలిపారు.
ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని వ్యాధులు
ఆరోగ్య శ్రీ కిందకు మరిన్ని వ్యాధులను తీసుకు రావాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీలో 2446 ప్రొసీజర్లు కవర్ అవుతున్నాయని సమీక్షలో అధికారులు తెలిపారు. దీనిపై నిరంతర అధ్యయనం చేయాలి, అవసరాల మేరకు, మరింత మంచి చేయడానికి ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించామని వైద్యులు, వైద్య సంఘాలతో చర్చిస్తున్నామని తెలిపారు. వారం రోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. నెలకు ఆరోగ్య శ్రీ కింద కనీసంగా రూ.270 కోట్లు ఖర్చు చేస్తున్నామని ..104,108 కోసం నెలకు కనీసంగా రూ.25 కోట్లు, ఆరోగ్య ఆసరా కింద నెలకు కనీసంగా రూ.35 కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కేవలం ఆరోగ్యశ్రీ, దానికింద కార్యకలాపాలకోసం ఏడాదికి దాదాపు రూ.4వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని .. గత ఏడాది ఆయుష్మాన్భారత్ కింద రూ.223 కోట్లు వచ్చాయని లెక్కలు వివరించారు. ఈ ఏడాది రూ.360 కోట్లు ఇస్తామని అంచనాగా చెప్పారని సీఎంకు వివరించారు.
పేషంట్కే నగదు బదిలీ
మరింత పారదర్శకంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయాలని.. నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి డబ్బు, అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్లో చెల్లించాలని నిర్ణయించారు. ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా ఈ ప్రక్రియ ఉండాలన్నారు. ముందుగా పేషెంటు డిశ్చార్జి అయ్యే సమయంలో కన్సెంటు ఫారం స్వీకరించి.. పేషెంటు, బ్యాంకు, ఆస్పత్రి మధ్య కన్సెంటుతో కూడిన ఫారం తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ విధానంలో చాలావరకు పొరపాట్లను నివారించే అవకాశం ఉంటుందన్నారు.
విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, కొత్త ఆస్పత్రుల నిర్మాణం, వీటిలో అభివృద్ధి పనులు నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్లో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని, కొత్తవాటి నిర్మాణం కూడా పూర్తవుతోందని అధికారులు చెప్పారు.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మరింత సమర్థవంతంగా అమలు
క్యాన్సర్ కేర్పైనా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ప్రాథమిక దశలో గుర్తించకపోవడం వల్ల చాలా మంది మరణిస్తున్నారని చివరిదశలో గుర్తించి, చికిత్సకోసం భారీగా ఖర్చు చేస్తున్నారని అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుందని అధికారులు తెలిపారు. విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్యాన్సర్ గుర్తింపుపై దృష్టిపెట్టాలన్నారు. అందుకోసం విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, పీహెచ్సీలను వీలైనంత త్వరగా పూర్తిచేసుకోవాలని ఇవి పూర్తయితే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానం సమర్థవంతంగా అమలు జరుగుతుందన్నారు.