ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో మోసానికి తెర తీశారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చారని… ఏళ్లు గడుస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. సీపీఎస్ పై చర్చిద్దాం రమ్మంటూ ఉద్యోగులకు ఆహ్వానం పలకడం కేవలం కాలయాపన చేయడానికే అని మండిపడ్డారు. మూడున్నరేళ్లు ఏమార్చిన ముఖ్యమంత్రికి… మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదని అన్నారు. చర్చల పేరుతో మరో మోసానికి తెరదీశారని చెప్పారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు ఉద్యోగులు భయపడరన్నారు. నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని, సెలక్టివ్ సంఘాలనే ఆహ్వానిస్తున్నారని ఆరోపించారు. కొన్ని సంఘాలు ప్రభుత్వ అనుకూల సంఘాలుగా మారటం శోచనీయమన్నారు. పీఆర్సీ బకాయిలు గురించి పోరాడాలని పిలుపిచ్చారు. డిఏ లు ఈ నాటికి జమకు నోచుకోకపోవటం ఉద్యోగుల పరిస్థితికి నిదర్శనమన్నారు. పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.