వైసీపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను కాపాడేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ఆరోపించారు. మాధవ్ వ్యవహారంలో వైసీపీ ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. భయపడుతున్నారా? అని ఆయన నిలదీశారు. ఆయనపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు టీడీపీ ఫిర్యాదు చేశామని.. చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ,గోరంట్ల మాధవ్పై చర్యల విషయంలో వైసీపీ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదన్నారు. వెంటనే బర్తరఫ్ చేయిస్తామని.. డిస్మిస్ చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇప్పుడేమో ఆ విషయాన్ని నిర్వీర్యం చేసేందుకు అది ప్రైవేటు వ్యవహారమని మాట్లాడుతున్నారని అన్నారు.‘మాధవ్పై చర్యలు తీసుకుంటే.. అదే పార్టీలో ఉన్న సగానికి సగం మందిపైనా చర్యలు తీసుకోవాలని భయపడుతున్నారా? మాధవ్ ఒక్కరే కాదు. వైసీపీ నేతల్లో చాలా మందిపై అత్యాచార కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో చూశాం. అలాంటి నేతలను వైసీపీ ప్రోత్సహిస్తోంది. మాధవ్పై చర్యలు తీసుకుంటామని చెప్పి.. ఇప్పుడు ఆయన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ జగన్ ఆలోచనే. ఆయనకు ఎప్పుడూ రాజకీయమే ముఖ్యం తప్ప.. ప్రజలు, మహిళల ప్రయోజనాలు కాదనే విషయం అర్థమవుతోంది. మాధవ్పై చర్యలు మొదలు పెడితే వైసీపీ సగం ఖాళీ అయిపోతుంది. అది గ్రహించే ఇప్పుడు మాటమార్చి ఆ విషయాన్ని పక్కదోవ పట్టించే పనిలో ఉన్నారు.’’ అని రామ్మోహన్నాయుడు అన్నారు.