మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోండి. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోండని ఆదేశించారు. మరొకసారి నిశితంగా వాటిని పరిశీలించి.వాటి ఆధారంగా ఫోకస్ పెట్టి వాటిని బాగుచేయాలని సూచించారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారని అన్నారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడ్డాయి. మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. రోడ్లను బాగుచేయడనికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుందని, ఒక నిధిని కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే… నెగెటివ్ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారు. మనం బాగుచేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయని అన్నారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి ఎం శంకరనారాయణ, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ కె వెంకటరెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం ఎం నాయక్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.