పోలవరం కోసం 23 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన సవాల్పై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. తమకు, వైఎస్ జగన్ కు ఎప్పుడు రాజీనామాలు చెయ్యాలో తెలుసు అంటూ, చంద్రబాబు ఉచిత సలహాలు ఇవ్వటం మానుకోవాలని హితవు పలికారు. భారత దేశంలోనే అత్యంత పిరికి నాయకుడు చంద్రబాబు ఎప్పుడు ఏం చేయాలో జగన్ మోహన్ రెడ్డి బాగా తెలుసని, తమకు చంద్రబాబు సలహా అవసరం లేదని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఉచిత సలహాలు ఇవ్వటం మాని ముందు తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఎంపీలు, రాజ్యసభ సభ్యులచే రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. ఇక రాజీనామాలపై వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు రాష్ట్రంలోని ఏ సమస్య పైన ఎమ్మెల్యే కాదు కదా సర్పంచును కూడా రాజీనామా చేయించి ఎరగడు అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికలంటే పారిపోయిన చంద్రబాబు తమకు సలహాలు ఇవ్వటం ఏంటి అంటూ మండిపడిన కొడాలి నాని, చంద్రబాబు ఇచ్చిన సలహాలు చూసి జనాలు నవ్వుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.