వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు పోయిందని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం ఏపీ సీఎంగా జగన్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ సంబరాలు చేసుకుంటూ ఉంటే… విపక్ష టీడీపీ జగన్ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ ఏకంగా ఓ చార్జి షీట్ను విడుదల చేసింది. ఈ చార్జి షీట్ విడుదల సందర్భంగా విశాఖలో టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో విధ్వంసంతో పాలనను ప్రారంభించిన నేతగా జగన్ నిలిచిపోయారని ఆయన ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్లో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిపోయిందని ఆయన ఆరోపించారు. మోసపూరిత సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. సొంత మనుషులకు జగన్ నిధులు దోచి పెట్టారని ఆరోపించారు. టీడీపీ పాలనలో సన్ రైజ్ ఏపీగా ఉన్న రాష్ట్రం.. జగన్ పాలన నేరాలు ఘోరాలమయంగా మారిపోయిందని ధ్వజమెత్తారు.