పేదల ఆరోగ్యానికి పూర్తి భద్రత
సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: నాడు-నేడు కార్యక్రమం కింద ఏకంగా రూ.1220 కోట్లతో పూర్తిస్థాయిలో ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని వెల్లడిరచారు. సచివాలయంలోని ఐదోబ్లాక్ కలెక్టర్లతో సోమవారం ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అవసరమైన సిబ్బంది నియామకంతోపాటు 16వేల కోట్ల రూపాయల ఖర్చుతో అత్యాధునిక భవనాల నిర్మాణం, వసతులు, ఆరోగ్యశ్రీ తదితర సేవలతో వైద్యారోగ్యశాఖకు సీఎం జగన్ కొత్త రూపు తెస్తున్నారన్నారు. 173 సీహెచ్సీలు, 53 ఏరియా వైద్య శాలలు, 17 జిల్లా ఆస్పత్రులు, 2 ఎంసీహెచ్లు నడుస్తున్నాయని వివరించారు. గతంలో వైద్య సిబ్బంది ఒక లెక్క అనేది లేకుండా ఉండేవారని, ఇప్పుడు అన్ని ఆస్పత్రుల్లో సిబ్బంది ఏకరీతిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇకపై అన్ని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎనిమిది మంది వైద్యులతోపాటు మొత్తం 31 మంది సిబ్బంది ఉంటారన్నారు. ఈ ఏడాది చివరికల్లా పూర్తి వసతులతో ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సీఎం జగన్ వైద్యారోగ్యశాఖ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, వైద్య విధానాన్ని పూర్తిగా సంస్కరిస్తున్నారని కొనియాడారు. అన్ని ఆస్పత్రుల్లో శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, డైట్, సెక్యూరిటీ ఏజెన్సీలన్నీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. జిల్లాల, రాష్ట్ర ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలనీ, రోగులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బాధ్యత తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారులు వెంబడి ప్రమాదాలు ఎక్కువగా నమోదువున్న ప్రాంతాల ఆస్పత్రుల్లో బ్లడ్బ్యాంకుల ఏర్పాటు చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అందుతున్న వైద్యసేవలు సంతృప్తికరంగా లేవని, పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించారు. జగనన్న కంటి వెలుగు ద్వారా చేపడుతున్న సర్జరీలు ప్రభుత్వ ఆర్థికసాయంతో జరుగుతున్నాయనే విషయాన్ని లబ్ధిదారులకు తెలిసేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవీవీపీ కమిషనర్ వినోద్కుమార్, జాయింట్ కమిషనర్, ఆయా జిల్లాల డీసీహెచ్ఎస్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.