ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
ఏపీలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న క్రైం రేట్పై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైం రేట్ వివరాలను లేఖలో వివరించారు. నేరాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం అయ్యారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, ఇతర వీడియోలు లేఖకు జతచేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉండుంటే రేపల్లె అత్యాచార ఘటన జరిగి ఉండేది కాదన్నారు. జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో వైసీపీ గూండాలు రెచ్చిపోతుంటే, పోలీసు శాఖ వారిని అదుపుచేయలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయిందని, దాంతో హింస, నేరాలు కూడా పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. గంజాయి వ్యవహారంలో వైసీపీ నేతల పాత్ర ఉందని తెలుస్తున్నా, పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. . జి కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు కారణం అని స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పిందన్నారు. శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలం అయ్యారని అన్నారు.