Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భారీవర్షాలు..ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

వర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష..
ఏపీలో భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌ దిశనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ, గోదావరికి ఈ ఏడాది ముందస్తుగానే వరదలు వచ్చాయని, దీంతో ఈ నెలలోనే 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని తెలిపారు. రేపు ఉదయానికి వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటం కూడా గోదావరిలో వరద ప్రవాహం పెరగడానికి కారణమని అన్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జగన్‌ చెప్పారు. ఏ ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదని అన్నారు. కంట్రోల్‌ రూమ్స్‌ సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు.. ‘వి.ఆర్‌.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. లైన్‌ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలి. అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు తెరవండి. సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలి. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వండి. తక్షణ సహాయంగా వారికి ఉపయోగపడుతుంది.పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలి. పారిశుధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలి. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కరెంట్‌ సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోండి. తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాలి. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండండి. చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోండి. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోండి. బోట్లు, లైఫ్‌ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచండి. అల్లూరి సీతారామరాజు, ఈస్ట్‌గోదావరి, ఏలూరు, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నాం. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాలని’ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img