ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై డీజీపీకి చంద్రబాబు లేఖ
గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అంశంపై డీజీపీ గౌతమ్ సవాంగ్కు చంద్రబాబు లేఖ రాశారు. మహనీయుల విగ్రహాలపై జరుగుతున్న ప్రణాళికాబద్దమైన దాడుల్లో పోలీసుల అలసత్వం తగదని హితవు పలికారు. ‘విగ్రహ విధ్వంసం వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పెద్ద కుట్రలో భాగంగానే చేశారు. ఇవి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలపై ప్రజలు తిరుగుబాటు చేస్తారు. 2019 జూన్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు అధికార వైసీపీ నాయకుల ఆదేశాల మేరకే జరుగుతున్నాయనడానికి ఎన్టీఆర్ విగ్రహ విధ్వంసమే నిదర్శనం’’ అని చంద్రబాబు అన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంలో జాతీయ నాయకులైన ఎన్టీఆర్, డా. బి.ఆర్ అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు లాంటి నేతల విగ్రహాలను ధ్వంసం చేసే చర్యలకు అధికారపార్టీ గూండాలను ప్రోత్సహిస్తోంది.ఇలాంటి విధ్వంసాలను ప్రోత్సహించడంలో పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పోలీసులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలను అదుపులోకి తీసుకోవడం మాని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించాలి. ఇప్పటికైనా పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలి. నేరస్తులపై పోలీసులు తీసుకునే తీసుకునే కఠినమైన చర్యలతో ఇలాంటి విధ్వంసకర చర్యలు పునరావృతం కాకుండా అడ్డుకుంటాయి’’ అని తెలిపారు.