విశాలాంధ్ర బ్యూరో, నెల్లూరు/ సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ సీ-53 రాకెట్టు గురువారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించగా విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ మాట్లాడుతూ, ఇది భారతదేశ ఖ్యాతిని మరింత పెంచిందని అన్నారు. ఈ ప్రయోగం విజయవంతంతో భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారని తెలిపారు. భారతదేశం నేడు తన రాకెట్లను ప్రయోగించడమే కాక ఇతర దేశాల రాకెట్లను కూడా ప్రయోగించే వేదిక కావడం గర్వంగా ఉందన్నారు. రాకెట్ ప్రయోగానికి 26 గంటల ముందు నుంచి కౌంట్డౌన్ ప్రారంభించి గురువారం సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు 2వ లాంచర్ పాడ్ నుంచి ప్రయోగించగా అది నాలుగు దశలలో విడిపోయి 19 నిమిషాల 26 సెకన్లలో కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిందన్నారు. సింగపూర్కు చెందిన ఈ రాకెట్టు 365 కిలోల బరువు గల భూ పరిశీలన ఉపగ్రహం డీఎన్ఈతో పాటు 155 కిలోల న్యూసర్ ఉపగ్రహం, నాన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్టీయూ) విద్యార్థులు తయారు చేసిన 2.8 కిలోల స్కూబ్ 1 అనే ఉపగ్రహం ప్రయోగించడం జరిగింది. ఇది పూర్తిగా వాణిజ్య ఒప్పందంతో జరుగుతున్న ప్రయోగం. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఇస్రో అనుమతి ఇవ్వడంతో శ్రీహరికోట పరిసర ప్రాంతాల నుంచి సుమారు పది వేల మందికి ప్రత్యక్షంగా వీక్షించడానికి అవకాశం కలిగింది. ప్రయోగం విజయంతం కావడంతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సీపీఐ నాయకులు మోదుగుల పార్థసారథి, మున్సిపల్ చైర్మ న్ శ్రీమంత్ రెడ్డి తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.