నిన్ననే కొన్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి..
భార్య పరిస్థితి విషమం
పెట్రోల్ ధరల సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీ స్కూటర్లు కొనుగోలు చేస్తున్నారు. కాని ఏదో చోట బ్యాటరీ పేలడంతో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఏపీలోని విజయవాడలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. సూర్యారావుపేటలోని గులాబీపేటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి నిన్ననే కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేశాడు. బైక్ బ్యాటరీకి రాత్రి బెడ్రూంలో చార్జింగ్ పెట్టి కుటుంబం మొత్తం నిద్రకు ఉపక్రమించింది. ఈ క్రమంలో తెల్లవారుజామున భారీ శబ్దంతో బ్యాటరీ పేలిపోయింది. ఇల్లంతా మంటలు వ్యాపించాయి. దీంతో శివకుమార్, అతడి భార్యా పిల్లలు భయంతో కేకలు వేశారు. మంటల్లో ఇరుక్కున్న వారి కుటుంబాన్ని ఇరుగుపొరుగు వారు వచ్చి బయటకుతీశారు. తీవ్రగాయాలపాలైన వాళ్లను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో శివకుమార్ మరణించాడు. అతడి భార్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.