గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన జగన్
విజయవాడలో కీలకమైన బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వర్చువల్ పద్ధతిలో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ను ప్రారంభించారు. దీంతో పాటు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం వర్చువల్ పద్ధతిలోనే 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు.బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 51 ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. . బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ను గడ్కరీ సహకారంతో వేగంగా పూర్తి చేశామని సీఎం తెలిపారు. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్తో విజయవాడలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అదేవిధంగా.. ఏపీలో ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ రోడ్డు, రోడ్ల మరమ్మతులకు రూ.2,300 కోట్లు కేటాయిస్తున్నామని.. ఉత్తరాంధ్ర, రాయలసీమలో రహదారుల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని కేంద్ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి కోరారు..అంతకు ముందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్రప్రభుత్వం తరపున మంత్రి శంకర్ నారాయణ ,ఎంపీ బాలశౌరి స్వాగతం పలికారు. బీజేపీ తరపున ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, బీజేపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ ,ఎమ్మెల్సీ మాధవ్ స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి బయల్దేరి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు.