ఏపీలో విద్యుత్ కోతలు, ప్రజల వెతలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందని, తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని ట్వీట్ చేశారు. గ్రామాల్లో అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు.నాడు మిగులు విద్యుత్ తో వెలుగులు నిండిన మన రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ ఎందుకు పోతోందని నిలదీశారు. రాష్ట్రంలో నేటి చీకట్లకు కారణం ఎవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పెరిగిన బిల్లులను ప్రజలు కిమ్మనకుండా కడుతున్నా ఈ కోతలు ఎందుకని మండిపడ్డారు. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ చంద్రబాబు వీడియోను జత చేశారు.‘‘ఓవైపు గ్రామాల్లో ప్రజలు కరెంట్ లేక రోడ్లెక్కుతుంటే వలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లను తగలేస్తూ పండుగ చేసుకుంటున్న ఈ ముఖ్యమంత్రిని నీరో అనక ఇంకేమనాలి? విద్యుత్ కోతలను ప్రశ్నించిన సామాన్య ప్రజలపై బెదిరింపులు మాని సమస్యను పరిష్కరించాలి’’ అని పేర్కొన్నారు.