విశాలాంధ్ర` కూర్మన్నపాలెం (విశాఖ) : విశాఖ ఉక్కు పోరు ఉధృతం చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 150వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారంనాటి దీక్షలో విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ ఐఎన్టీయూసీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాలలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగ పరిశ్రమగా కొనసాగుతుందని ప్రకటన చేయాలన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేని కారణంగానే ఈ అప్పులు పెరిగాయన్నారు. ఈ పోరాటం పెట్టుబడి దారులు, కార్మికవర్గానికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యులు కావాలని పిలుపునిచ్చారు. కూర్మన్న పాలెం జంక్షన్లో 150వ రోజు సందర్భంగా మానవహారం నిర్మించారు. ఈదీక్షలో డి.ఆదినారాయణ, మురళీరాజు, జె.అయోధ్య రామ్, గంధం వెంకట రావు, వరసాల శ్రీనివాస్రావు, నీరుకొండ రామచంధ్రరావు, బి.అప్పారావు, గోపి, ప్రసాద్, సంపూర్ణం, కార్యకర్తలు పాల్గొన్నారు.