Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బులు జమ..

అకౌంట్‌లలో డబ్బులు జమ చేసిన ఏపీ సీఎం జగన్‌
‘వైఎస్సార్‌ కళ్యాణమస్తు’, ‘వైఎస్సార్‌ షాదీ తోఫా పథకానికి సంబంధించి నిధుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి జగన్‌ అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో ఈ పథకాలను ప్రారంభించామన్నారు సీఎం జగన్‌. అక్టోబరు- డిసెంబర్‌ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెలపాటు సమయం ఇచ్చామన్నారు సీఎం. ఫిబ్రవరిలో వెరిఫికేషన్‌ పూర్తిచేసి.. ఇవాళ నేరుగా వారికి నగదు జమచేస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి ఏటా ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి దరఖాస్తులో ఏప్రిల్‌లో స్వీకరిస్తామని.. మేలో వారికి మంచి చేస్తామన్నారు. ఈ పథకం సమూలంగా ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.ఈ పథకాలకు కనీస వయస్సు చెల్లెమ్మలకు 18 ఏళ్లు, తమ్ముళ్లకు 21 ఏళ్లుగా నిర్దేశించామని గుర్తు చేశారు. టెన్త్‌ సర్టిఫికెట్‌ కచ్చితంగా ఉండాలని చెప్తున్నామని.. ఈ ప్రోత్సాహకం కోసం కనీసంగా టెన్త్‌ వరకూ తీసుకున్నామన్నారు. తర్వాత అమ్మ ఒడి ఉంది కాబట్టి సహజంగానే ఇంటర్మీడియట్‌ చదువుకుంటారని.. ఆ తర్వాత విద్యావీవెన, వసతి దీవెన పథకాలు ఉన్నాయి కాబట్టి.. ఇంటర్మీడియట్‌ నుంచి ఆగిపోకుండా చదువులు ముందుకు కొనసాగుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల్లోని ఆడపిల్లలందరికీ కూడా మంచి జరుగుతుందన్నారు.వచ్చే త్రైమాసికం నుంచి కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బులు పెళ్లికూతురు తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నామన్నారు. పలువురి సూచనలమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లకోసం కొంతకాలం ఆగొచ్చు.. కానీ చదువులు ఆగిపోకూడదన్నారు. అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుందన్నారు సీఎం. పదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నామన్నారు. ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉందని.. మన పిల్లలకు ఎక్కడకు వెళ్లినా గెలిచే పరిస్థితి ఉండాలన్నారు.గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్‌ సర్టిఫికెట్లు, దరఖాస్తు పూర్తి ఏర్పాట్లు.. ఎక్కడా కూడా లంచాలకు, వివక్షకు తావులేదన్నారు. గతంలో కూడా ఇలాంటి తరహా కార్యక్రమం ప్రకటించారని.. కానీ అమలు ఘోరంగా ఉందన్నారు. మంచి చేయాలన్న ఆలోచనతో చేసింది కాదని.. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆరోజు తీసుకు వచ్చారన్నారు. అరకొరగా డబ్బులు ఇచ్చారు.. అవి కూడా పూర్తిగా ఇవ్వలేదన్నారు. 2018-19 సంవత్సరంలో 17,709 మంది లబ్ధిదారులకు రూ. 68.68 కోట్లు ఎగ్గొట్టారని.. 2018 అక్టోబరు నుంచి పూర్తిగా ఎగ్గొట్టారన్నారు. కేవలం ప్రకటనలకే ఆనాడు పథకం పరిమితి అయ్యిందని విమర్శించారు. ఎస్సీలకు గతంలో రూ.40వేలు అయితే ఇప్పుడు లక్ష చేశామని.. ఎస్సీలు కులాంతర వివాహాలకు గతంలో రూ.75వేలు ప్రకటిస్తే ఇప్పుడు రూ.1.2లక్షలు చేసి అమలు చేస్తున్నామన్నారు. గతంలో ఎస్టీలకు రూ.50వేలు అయితే.. ఇప్పుడు రూ.. 1 లక్ష ఇస్తున్నామన్నారు. ఎస్టీ కులాంతర వివాహాలకు గతంలో రూ.75వేలు అయితే ఇప్పుడు రూ.1.2 లక్షలు ఇస్తున్నామని గుర్తు చేశారు. బీసీలకు గతంలో రూ.35వేలు అయితే ఇప్పుడు రూ.50వేలు.. బీసీలు కులాంతర వివాహాలకు గతంలో రూ.50వేలు అయితే ఇప్పుడు రూ.75వేలు ఇస్తున్నామన్నారు. మైనార్టీలకు గతంలో రూ.50వేలు అయితే ఇప్పుడు రూ.1 లక్ష రూపాయలు ఇస్తున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతులకు గతంలో రూ.1 లక్ష అనిచెప్తే.. ఇప్పుడు రూ.1.5లక్షలు.. భవన, ఇతర కార్మికులకు గతంలో రూ.20వేలు అయితే.. ఇప్పుడు రూ.40వేలు ఇస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img