మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సునీల్ యాదవ్(ఏ2), ఉమాశంకర్ రెడ్డి(ఏ3), దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి(ఏ5) కి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారవుతాయని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ముగ్గురి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. అనారోగ్య కారణాలతో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఈ ముగ్గురు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీరి బెయిల్కు సంబంధించి కొన్ని నెలలుగా హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. వీరికి బెయిల్కు సంబంధించి తాము వివేకా కుమార్తె సునీత ఆందోళనను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో శివశంకర్ రెడ్డి ప్రమేయం ఉందనే విషయం నిర్ధారణైందంటూ సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
శివశంకర్ రెడ్డి జైల్లో ఉంటూనే సాక్షులను బెదిరింపులకు గురిచేస్తున్నారని, హత్యలో అతని ప్రమేయం ఉన్నట్లు సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జిషీటుద్వారా తెలుస్తోందంటూ సునీత న్యాయవాది న్యాయమూర్తి ముందు గతంలోనే తమ వాదనలు వినిపించారు. రాష్ట్ర పోలీసులు సీబీఐకి సహకరించడంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.