గన్నవరం వైఎస్సార్సీపీలో రాజకీయం గరం గరంగా మారింది. పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. వైఎస్సార్సీపీ నేతలు దుట్టా రామచంద్రరావు , యార్లగడ్డ వెంకట్రావుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , మాజీ మంత్రి కొడాలి నానిపై ఇద్దరు నేతలు చేసిన కామెంట్స్ కలకలంరేపాయి.ఈ వీడియోలో చేసిన వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. కొందరు పనీ పాట లేని వాళ్లు ఏదో ఒకటి మాట్లాడతారని.. ఈ వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకుని వెళ్ళాల్సి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు ఏం మాట్లాడారో తాను ఇంకా చూడలేదని.. తాను గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో బిజీగా ఉన్నానన్నారు. వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు, కొడాలి నానికి తెలుసన్నారు. మరోసారి ఎక్కువగా మాట్లాడితే డొక్క పగలగొట్టి డోలు కడతామని వార్నింగ్ ఇచ్చారు. వార్డుకు, పంచాయతీకి గెలవని వాళ్లు తనకు సహకరించేది ఏంటని దుట్టాపై సెటైర్లు పేల్చారు. వంశీని, కొడాలి నానిని తిడితే పెద్ద వాళ్లం అవుతున్నామని.. వాళ్లే అంటున్నారన్నారు. టీడీపీలో తాను, నాని ఎలా ఉన్నామో వైఎస్సార్సీపీలో కూడా తమ స్టైల్ అలాగే ఉంటుందన్నారు. కళ్ళు చిదంబరం అద్దం ముందు నిలబడి మహేష్ బాబు అనుకుంటే అయిపోతారా అన్నారు.