ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బొండా ఉమ విరుచుకుపడ్డారు. వాసిరెడ్డి పద్మ తీరు హేయంగా ఉందన్నారు. సోమవారం విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు. విజయవాడ అత్యాచార బాధితురాలికి అండగా నిలవడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. మహిళా చైర్పర్సన్గా ఉండి… మీరు చేస్తుంది ఇదేనా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత బాధితురాలిని కలవడానికి వచ్చారన్నారు. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులకు స్పందించిందే లేదన్నారు. దీనిపైన తాము న్యాయ పోరాటానికి సిద్ధమని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 30 గంటల పాటు ఒక మానసిక వికలాంగురాలిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆయన విమర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయాలకు వాడుకొంటోందని ఆరోపించారు. తూ తూ మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకున్నారన్నారు. బాధితురాలికి, ఆమె తల్లిదండ్రులకు తాము అండగా నిలిచామని తెలిపారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తే రూ.10 లక్షలకు వెలకట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలిచినందుకు తమపై కక్ష పూరిత చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు.